సామాజిక సమస్యలపై దృష్టిపెట్టండి


 దేశం ఎదుర్కొంటున్ పోషకాహారం లోపం వంటి సామాజిక సమస్యలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. శనివారం ప్రధాని అధ్యక్షతన ‘కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌' (సీఎస్‌ఐఆర్‌) సొసైటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశంలో వర్చువల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని, తద్వారా మారుమూల విద్యార్థులకు కూడా సైన్స్‌ చేరువవుతుందని చెప్పారు. సైన్స్‌వైపు యువ విద్యార్థులను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ద్వారా ‘పోషకాహార లోపం’ వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని శాస్త్రవేత్తలను కోరారు. ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల అభివృద్ధి కోసం సంప్రదాయ పరిజ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో మిళితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, సీబీఎస్‌ఈ బోర్డ్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని మోదీ సూచించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఎగ్జామ్‌ వారియర్స్‌గా అభివర్ణించారు.